తప్పించుకునే ప్రయత్నంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ పై నుంచి కిందపడిన సైబర్ నేరస్తుడు

  • తెలంగాణలో పలు నేరాలకు పాల్పడిన నైజీరియన్ ముఠా
  • పోలీసులకు చిక్కిన నేరస్తుడు
  • హైదరాబాద్ తీసుకొచ్చేందుకు తెలంగాణ భవన్‌లో బంధించిన పోలీసులు
  • టాయిలెట్ పైపుల ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో కిందపడి గాయాలు
ఢిల్లీలో పోలీసులకు చిక్కిన ఓ సైబర్ నేరగాడు తప్పించుకునే ప్రయత్నంలో తెలంగాణ భవన్ నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని అమాయకులను బుట్టలో వేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల ఆర్థిక మోసాలతో సంబంధం ఉన్న ఓ నైజీరియన్ పోలీసులకు పట్టుబడ్డాడు.

దీంతో అతడిని హైదరాబాద్ తరలించేందుకు తెలంగాణ భవన్‌లోని గోదావరి బ్లాక్ నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఉంచారు. అయితే, టాయిలెట్ పైపుల ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు పట్టుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో చెట్టుకొమ్మలు తగిలి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విమానంలో నిందితుడిని హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది.

Telangana
Cyber Crime
Telangana Bhavan
Nigerian

More Telugu News